
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడం శుభ పరిణామమన్నారు.సింగిల్ జడ్జి తీర్పు సమయంలో వైకాపా నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రమేశ్ గుర్తు చేశారు. ఇప్పుడు ధర్మాసనం తీర్పుతో వారంతా రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. బాధ్యతగల పదవుల్లో ఉన్నపుడు ఆచితూచి మాట్లాడాలని హితవు పలికారు.
తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారని, మూడు, నాలుగు నెలల క్రితం ఇతర రాష్ట్రాల విషయంలోనూ ఎన్నికలు నిర్వహించవచ్చని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు.