
కరోనా వైరస్ తీవ్రత వలన తల్లితండ్రులు ఉపాధి కోల్పోయి విద్యార్థులు ఆర్ధిక ఇబ్బందులు పడుతుండటంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో గురువారం జనవరి 21వ తేదీన కర్నూలుకు చెందిన ఐదుగురు విద్యార్థినులు బి. గీత, వై. జోషిత ప్రకాశిని, బి. మమత, వై లక్ష్మి లిఖిత, బి. గాయత్రి లకు 50,000 రూపాయల ఉపకారవేతనాలు కర్నూలు డిఎస్పీ కే.వి. మహేష్ ద్వారా అందించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ కే.వి. మహేష్ మాట్లాడుతూ తానా తరపున చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా ఉన్నాయని విద్యార్థులకు సహాయం అందిస్తున్న రవి పొట్లూరిని అభినందించారు.
కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ తానా కార్యదర్శి పొట్లూరి రవి తన సొంత నిధులతో, మిత్రుల ద్వారా గత మూడు నెలలలో వంద మందికి పైగా విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తానా రూపొందించిన 2021 నూతన సంవత్సర క్యాలెండర్లను డిఎస్పీ కే.వి. మహేష్ ఆవిష్కరించారు. కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సందడి మధు, మీనాక్షి నాయుడు, అమిత్ జంపాల, విద్యార్థుల తండ్రులు పాల్గొన్నారు.