
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను మ్యుమంత్రిని చేయాలంటూ పలువురు టీఆర్ఎస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యువనేతకు సీఎం పగ్గాల విషయంలో కొన్నాళ్లుగా అంతర్గతంగా జరిగిన ప్రచారం గత కొద్ది రోజులుగా బహిరంగంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచారాన్ని సమర్థిస్తూ తాజాగా పలువురు నేతలు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేముందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ విషయంపై తగిన సమయంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో నీళ్లు లేక రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం రైతులు సంతోషంగా పంటలు పండించుకుంటున్నారన్నారు. కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని విమర్శించారు.