
భారత్లో కరోనా వైరస్ కేసులు అత్యల్పంగా రికార్డు అయ్యాయి. గత 24 గంటల్లో కేవలం 10,064 మందికి మాత్రమే వైరస్ సంక్రమించింది. గత ఏడు ఎనిమిది నెలల్లో ఇదే అత్యల్ప సంఖ్య కావడం విశేషం. దేశ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు 1.05 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే రికవరీ అయిన వారిలో 1.02 కోట్ల మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైన నాలుగు రోజుల తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం విశేషం. ఇప్పటి వరకు ఇండియాలో 3.8 లక్షల మంది కరోనా టీకాను ఇచ్చారు.
గత 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాల్లోనూ ఇండియా అత్యల్ప రికార్డు నమోదు చేసింది. వైరస్ బారిన పడినవారిలో కేవలం 137 మంది మాత్రమే నిన్న మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. దీంతో ఇప్పటి వరకు వైరస్ వల్ల చనిపోయిన వారి సంఖ్య 1,52,556కు చేరుకున్నది. గత ఏడాది జూన్ 11వ తేదీన పది వేల కన్నా తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ రోజున 9996 మందికి వైరస్ సంక్రమించింది. అయితే 8 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ దేశంలో పాజిటివ్ కేసులు పదివేల వద్దే ఆగిపోయాయి.