
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా భారత్ రికార్డు స్థాయిలో టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా పంపిణీ ప్రారంభమైన తొలిరోజే దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపింది. ఇది అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒకేరోజు వేసిన సంఖ్య కంటే ఎక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహన్ అగ్నాని వెల్లడించారు. తొలి రోజు రెండు లక్షల 7 వేల మంది వ్యాక్సిన్ తీసుకోగా, రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్ అందించారు. ఇప్పటి వరకు 2,24,301 మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో 447 మందికి దుష్ప్రభావాలు కనిపించాయని, అవి కేవలం సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమేనని సృష్టం చేసింది. అయితే వీరిలో ముగ్గురికి మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిచాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.
వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆరోగ్యంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాల్లో టీకా పంపిణీ కొనసాగిందని తెలిపారు. ఇక వ్యాక్సిన్ పంపిణీపై అన్ని రాష్ట్రాలతో సమీక్ష జరిపామని, తొలిరోజు ఎదురైన సమస్యలను గుర్తించామని చెప్పారు.