
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికల వస్తాయని జోస్యం చేప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాంనగర్లో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం జాగ్రత్త అని హెచ్చరించారు. కేంద్రం త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుందన్నారు.
భారత్ బయోటెక్కు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇంట్లో చెప్పే వచ్చానని చావుకు భయపడేది లేదన్నారు. ట్యాంక్బండ్ విగ్రహాలను టచ్ చేస్తే కచ్చితంగా దారుసలాంను కూల్చేస్తామని మరోసారి హెచ్చరించారు. ఎక్కువ రోజులు నిలబడని ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో డివిజన్కు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారని, టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.