
ఆంధప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28 లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హౌసింగ్ కాలనీల నిర్మాణం, డిసెంబర్ 8న 2.49 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూ సేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల భీమా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్ యూనివర్శిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ శాశ్వత భూహక్కు, యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదించింది. రూ.9,027 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ నివర్ తుపానుపై కేబినెట్లో చర్చించామని తెలిపారు. 30వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 1300 హెక్టార్లలో ఉద్వానవన పంటలు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు. సుమారు 10 వేల మందికి పైగా సహాయక శిబిరాలకు తరలించాం. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఉద్యోగులు, పింఛన్దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించామని, 3.144 శాతం డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్, జనవరి నెలలో చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
డిసెంబర్ 2 నుంచి ఏపీ అమూల్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని తెలిపారు. తొలిదశలో ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో 9,889 బల్క్ చిల్లింగ్ అభివృద్ధికి నిర్ణయించామన్నారు. డిసెంబర్ 10న గొర్రెలు, మేకల యూనిట్లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లు తెస్తున్నామని పేర్కొన్నారు. పశువుల దాణాను కల్తీ చేస్తే జరిమానా, జైలుశిక్ష విధించేలా బిల్లును తీసుకువస్తున్నామని తెలిపారు.