
అమెరికాలో ఔషధ అమ్మకాల్లో అక్రమ విధానాలకు పాల్పడుతున్నారంటూ దాఖలైన ఓ దావాలో భారత్కు చెందిన అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, లుపిన్ సంస్థలు పేర్లున్నాయి. మొత్తం 26 సంస్థలపై ఈ వ్యాజ్యాన్ని మేరీలాండ్ అటార్నీ జనరల్ కనెక్టీకట్ జిల్లా కోర్టులో దాఖలు చేశారు. ధరలను కృత్రిమంగా పెంచి, మార్కెట్లో పోటీని తగ్గించి, అసమంజసంగా వాణిజ్యాన్ని నిరోధిస్తూ కుట్ర చేసి అమెరికా వ్యాప్తంగా ఔషధాలను అమ్ముకున్నారు అని అటార్నీ జనరల్ బ్రియాన్ ఈ ఫ్రోష్ అందులో ఆరోపించారు. 80 రకాల జనరిక్ ఔషధాల మార్కెటింగ్, అమ్మకాల్లో 26 సంస్థలు, 10 మంది వ్యక్తులు అవకతవకలకు పాల్పడ్డారని బ్రియాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కుట్రతో అమెరికాకు బిలియన్ డాలర్లలో ఆదాయం దూరమైందని చెప్తున్నారు. కాగా అమెరికాలోని మిగతా అటార్నీ జనరల్స్ కూడా ఈ విషయంలో మేరీలాండ్ అటార్నీ జనరల్తో కలిశారు. నష్టపరిహారాలను ఇప్పించాలని, పౌర జరిమానాలను విధించాలని వీరంతా కోరుతున్నారు. జనరిక్ ఔషధ మార్కెట్లో కొరవడిన పోటీయుత వాతావరణాన్నీ తిరిగి పెంపొందించాలని సూచిస్తున్నారు.