
ఓ వైపు దేశవ్యాప్తంగా కరోనా నేపధ్యంలో ఆర్ధిక పరిస్థితులు దిగజారి కోట్లాది మంది ప్రజలు ఇక్కట్లు పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా వస్తుండడం ప్రజారంజక పధకాలకు చిరునామాగా నిలవాలనుకున్న వైసీపీ ప్రభుత్వ ఆశలకు గండికొడుతోంది. పాత విధానాన్ని మార్చి డైనమిక్ విధానంలో కొత్త బిల్లులు వేస్తున్నామని అందుకే వ్యత్యాసం కనపడుతుందని ప్రభుత్వం అంటున్నప్పటికీ ప్రజల్లో దీనిపై అసంత్రుప్తి నెలకొంది. మరోవైపు వైసీపీ వ్యతిరేక మీడియా కూడా ఈ అవకాశాన్ని అందిపచ్చుకుని ప్రజాగ్రహాన్ని పెంచే ప్రయత్నం చేస్తుండడంతో రాష్ర్ట ఆర్ధికశాఖమంత్రి శ్రీ బుగ్గనరాజేంధ్రనాధ్ రెడ్డి దీనిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా ఆయన ఈ సందర్భంగా నిశితంగా విమర్శించారు. ఆయన వివరణలోని ముఖ్యాంశాలు...
పత్రికల కధనాలపై...
విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఈనాడు,ఆంధ్రజ్యోతిలలో తప్పుడు ప్రచారంతో వార్తలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈరోజు ఈనాడులో బిల్లు చూస్తే తిరిగేను కళ్లు శీర్షికన ఇచ్చిన వార్తా కధనంలో సబ్జెక్ట్ కు శీర్షికకు సంబంధమేలేదు. వారు ఇచ్చిన మొత్తం టేబుల్ చూస్తే సి కేటగిరిలో 500 యూనిట్లు దాటితే తప్ప, వేరే ఎక్కడైనా మార్పు ఉందా అంటే లేదు. పాత టారిఫ్ కు కొత్త టారిఫ్ కు సి కేటగిరిలో 500 యూనిట్లు దాటితే అది రిచ్ మెన్స్ కన్సంప్షన్స్.అలా వాడకం పెరగాలంటే రెండు,మూడు ఏసిలు నడిస్తే తప్ప అలా బిల్లు రాదు. విద్యుత్ బిల్లుల చెల్లింపులకు జూన్ 30 వతేదీ వరకు వెసులుబాటు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రిగారు స్వయంగా ప్రకటించారు. అయినా ఈనాడులో మాత్రం జూన్ 15 వ తేదీ అని రాస్తారు.ఆంధ్రజ్యోతిలో కరెంట్ పిడుగు... లాక్ డౌన్ వేళ విద్యుత్ బిల్లుల మోత వినియోగదారుల నెత్తిన బిల్లుల బాంబ్ శీర్షికన వార్త.ఈ వార్త చూస్తే ఇక్కడేదో వార్ జరుగుతున్నట్లుగా ఉంది.ఆ వార్తలు చూస్తే అంతా రాంగ్ రిపోర్టింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.పబ్లిక్ డొమెయిన్ లో ఉండే సమాచారం కూడా ఇంత రాంగ్ గా ఎలా ఇస్తారు.
సమాచారం సిద్ధం...
నిజానికి వినియోగదారుల అనుమానాలు నివృత్తి చేయడానికి రెండు సంవత్సరాల వాడకం సమాచారం అందుబాటులో పెడుతున్నట్లు విద్యుత్ సంస్ధ ప్రకటించింది.బిల్లుతో పాటు వడ్డీలు గాని పెనాల్టిలు గాని చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా వంటి సంక్షోభసమయంలో కూడా ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేయగలిగింది.విద్యుత్ సరఫరాపై శ్రీ వైయస్ జగన్ గారు ఇంధన శాఖమంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డిగారు నిరంతరం సమీక్షలు చేస్తూ పర్యవేక్షణ చేస్తున్నట్లు ట్రాన్స్ కో సిఎండి నాగులాపల్లి శ్రీకాంత్ ప్రకటించారు.
బిల్లుల విధింపు తీరుపై...
ప్రస్తుత బిల్లుల్లో రెండు నెలలుగా వినియోగించిన విద్యుత్ ను రెండు సగాలుగా విభజించి బిల్లు వేయడం జరిగింది.మార్చి నెలకు 2019-20 టారిఫ్ క్యాటగిరి వర్తింపచేశాం.అదే విధంగా 2020-2021 నూతన టారిఫ్ ఏప్రిల్ కు వర్తింపచేశాం. 75 యూనిట్లలోపు అయితే ఏ కేటగిరి 225 యూనిట్లు అయితే బి కేటగిరి 500 యూనిట్లు దాటితే సి కేటగిరి అని స్పష్టంగా ప్రకటించారు.
సోషల్ మీడియా వైరల్ వీడియోపై..
.సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఒక కేసును పరిశీలిద్దాం.గొల్లపూడికి చెందిన తులిమెళ్ల వెంకట్....ఫిబ్రవరి నెలలో 95 యూనిట్లు వాడారు....318 రూపాయలు బిల్లు వచ్చింది.కాకపోతే ఈరెండు నెలల్లో కలిపి 628 యూనిట్లు వాడారు మూడువేల చిల్లర బిల్లు వచ్చింది.ఇది ఎంత పెరిగింది అంటే సిస్టమేటిక్ గా కాలిక్యులేట్ ప్రకారమే పెరిగింది. 2019 మార్చి,ఏప్రిల్ లో ఇదే వినియోగదారుడి స్టేట్ మెంట్ చూస్తే 197 యూనిట్లు....323 యూనిట్లు కలిపితే మార్చి,ఏప్రిల్ కు సంబంధించి 520 యూనిట్లు వచ్చింది.ఈ సంవత్సరం 628 యూనిట్లు వచ్చింది అంటే వంద యూనిట్లు షుమారుగా పెరిగింది. మార్చి, ఏప్రిల్ రెండు నెలలు లాక్ డౌన్ కాబట్టి.... అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఆటోమెటిక్ గా ఎంతోకొంత వినియోగం పెరుగుతుంది.పైగా ఇది వేసవి.డిఫరెన్స్ ఏంటో అర్ధం కావడం లేదు.అంతకుముందు బిల్లు చూసినా కూడా దాదాపు మూడువేలు కట్టారు. తేడా పెద్దగా కనబడటం లేదు.
గత ప్రభుత్వ స్టాటిక్పై...
స్టాటిక్ అంటే ఏంటి...డైనమిక్ అంటే ఏంటి....స్టాటిక్ అనే పధ్దతి ఏపిలోనే వాడారు.హిస్టారికల్ గా చూస్తే 2013 వరకు విద్యుత్ కు సంబంధించి 0 నుంచి 50.ఏభై నుంచి పైకి రెండే గ్రూపులు ఉండేవి.2014 వచ్చాక కన్సల్టెంట్లను పెట్టుకున్నారు.వాళ్లు రకరకాల కేటగిరిలు పెట్టారు. పేరుకు ఎవరికి ఛార్జీలు పెంచకుండా... ఖర్చులు డిస్కామ్ లో పెరిగినా పబ్లిక్ కు టారిఫ్ పెంచకుండా వేరే కేటగిరిలో పెట్టి ఎక్కువ లాగాలనే ఉధ్దేశ్యంతో టిడిపి ప్రభుత్వం స్టాటిక్ అనే పద్ధతి 2016 నుంచి 2019 వరకు అమలులోకి తెచ్చింది. మన దేశంలో మరే రాష్ట్రంలో స్టాటిక్ పద్ధతి వాడటం లేదు.
డైనమిక్కు మార్పుపై
ఏపిఈఆర్ సి వారు ఈ సంవత్సరం ఎంతోమంది నుంచి వినతులు తీసుకున్నారు.వినియోగదారుల ఫోరమ్స్,కమ్యూనిస్టులనుంచి కూడా రిప్రజంటేషన్ తీసుకున్నారు.ఈ సారి డైనమిక్ పధ్దతికి అని చెప్పి ఏపిఈఆర్ సి ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ లో చెప్పడం జరిగింది. కొందరు వినియోగదారులు సూచనలమేరకు గత ఏడాది ఏవరేజ్ తీసుకునే పద్దతి ఏదైతే వద్దన్నారు. వేరే రాష్ర్టాలతో పోలిస్తే 200 యూనిట్లు లోపు విద్యుత్ వాడే వినియోగదారుడికి భారత దేశం లో ఇతర రాష్ర్టాలకంటే తక్కువ రేటుకు మన రాష్ర్టం విద్యుత్ ఇస్తోంది.
విద్యుత్ కొనుగోళ్ల బకాయిలపై
పవర్ పర్చేజ్ బకాయిలు చూస్తే టిడిపి ప్రభుత్వం వచ్చేనాటికి అంటే 2014 మార్చిలో 4,900 కోట్లు ఉంటే.. వాటిని 2019నాటికి 20 వేల కోట్లు బకాయిలు కు చేర్చారు. అంటే బకాయిలు ఐదింతలు పెంచి మా మేధస్సు ఎవరికి లేదు,విద్యుత్ గురించి మాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అని టిడిపి ప్రభుత్వం గొప్పులు చెప్పింది. 2019 డిసెంబర్ నాటికి మా ప్రభుత్వం పవర్ పర్చేజ్ బకాయిలను 15 వేల కోట్లకు తీసుకురాగలిగింది.అంటే ఐదు వేల కోట్లు చెల్లించాం. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలు డొమెస్టిక్ సబ్సిడీ,ఎస్సిఎస్టి సబ్సిడీ,వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ గాని 2014 మార్చిలో సున్నాగా ఉంటే 2019 కి 7,172 కోట్లు డిస్కమ్ లకు కట్టాల్సి ఉంది . ఈ ప్రభుత్వం డిసెంబర్ లోపు అంటే ఆరునెలల పరిపాలనలో బకాయిలను 3,900 కోట్లకు తగ్గించింది. పవర్ పర్చేజ్ బకాయిల విషయానికి వస్తే 2018-19 లో కేంద్ర ఉత్పత్పి దారులకు చెల్లించాల్సింది 5,161 కోట్లు ఉన్నాయి.మా ప్రభుత్వం 4,100 కోట్లకు తగ్గించింది. జెన్ కో కు బకాయిలు 2014 లో 2,100 కోట్లు ఉంటే టిడిపి ప్రభుత్వం తన పరిపాలనతో11,350 కోట్లకు పెంచింది.మా ప్రభుత్వం రాగానే దానిని 6,800 కోట్లకు తగ్గించింది. మొత్తం ఎస్పిడిసిఎల్,ఈపి డిసిఎల్,ట్రాన్స్ కో, జెన్ కో ,పిపిడిసిఎల్ అన్నింటికి సంబంధించి అప్పు 2014-15కి 31,650 కోట్లు ఉంది.దానిని టిడిపి ప్రభుత్వం 60,500 కోట్లకు పెంచింది. నష్టాలు చూస్తే 2014-15 లో 7వేల కోట్లు గా ఉంది.టిడిపి ప్రభుత్వం ఆ నష్టాలను 30 వేల కోట్ల కు పెంచింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సబ్సిడీలు,బకాయిలు కట్టడమే కాకుండా అప్పు కూడా తక్కువ రేటుకు తెచ్చింది.
కొనుగోలు ధరలపై...
పవర్ పర్చేజ్ కాస్ట్ ఎలా ఉందంటే 2014లో యూనిట్ రూ.4.33 పై. కొనుగోలు చేస్తే... టీడీపీ పెద్దలు దానిని 2019 లో యూనిట్ 6 రూపాయల ఏడుపైసలకు పెంచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5.16 పైసలుకు యూనిట్(కొనేధర) తగ్గించాం. టెంపరరీగా కొనే విధ్యుత్ కూడా టిడిపి హయాంలో అక్టోబర్ 2018లో 6రూపాయలక75 పైసలకు యూనిట్ కొంటే మా ప్రభుత్వం హయాంలో (2019,అక్టోబర్) చూస్తే మూడు రూపాయల 40 పైసలకు కొన్నాం.
పాలన భేష్... రెణ్నెళ్లలో డైనమిక్ లాభాలు...
కోవిడ్ తో ప్రజలు,అన్ని విభాగాలు అందరూ ఇబ్బంది పడుతున్నారు.కేవలం రాజకీయం చేయడానికి కొన్ని పార్టీ లు.కొందరు నేతలు విద్యుత్ ఛార్జీలు విషయంలో అవాస్తవాలు చెప్పి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగుతోంది.మేనిఫెస్టో ప్రకారం నిర్ణయాలు అమలు చేస్తున్నారు.ముఖ్యమంత్రిగారు నిత్యం సమీక్షలు చేస్తూ సిస్టమాటిక్ పరిపాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు.ప్రతి వినియోగదారుడికి సంబంధించి రెండు సంవత్సరాల విద్యుత్ వినియోగం అందుబాటులో ఆన్ లైన్ లో ఉంచమన్నాం.దానిని చూస్తే అపోహలు తొలగుతాయి.
స్టాటిక్ నుంచి డైనమిక్ సిస్టమ్ లోకి మారడం వల్ల కలిగే లాభాలు ఏంటనేది జూన్,జులై నాటికి అందరికి తెలుస్తుంది.