
అమెరికాలో ఉన్న తెలుగు చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ ప్రతి సంవత్సరం చివరిలో వసంతోత్సవం పేరుతో వార్షిక వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారుల చేత వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగు భాషా పటిమను ప్రదర్శించే నాటకలు, పద్యాల పఠనాలు వంటివి నిర్వహిస్తారు. ఈ వసంతోత్సవం చూసేందుకు చిన్నారుల తల్లితండ్రులతోపాటు, ఇతరులు కూడా ఆసక్తిని కనబరుస్తారు. ఈ సంవత్సరం కూడా వసంతోత్సవంను ఘనంగా నిర్వహించేందుకు పాఠశాల సిద్ధమైంది.
బే ఏరియాలో ఉన్న ఆరు పాఠశాలల కేంద్రాలు ఈ వసంతోత్సవం ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. గతంలో జరిగిన వసంతోత్సవ వేడుకల్లో కవి జొన్నవిత్తుల, టీవీ యాంకర్ సుమ, సినీకవి చంద్రబోసు లాంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు.ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ గంటా శ్రీనివాసరావు కూడా ఒక వసంతోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హోదాలో ఉత్తీర్ణులైన పిల్లలకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రాధానం చేశారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు ఫిబ్రవరి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ తరువాత లాక్డౌన్ పరిస్థితి రావడం, విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మీద పాఠశాల బోధనను ఉగాది నుంచి ఆన్లైన్లో చెప్పడం జరుగుతోంది. ఇప్పటికే అన్ని సెంటర్లు ఆన్లైన్ ద్వారా పాఠాలు చెపుతూ మే నెలాఖరుకు కోర్సు పూర్తి చేసుకొని జూన్ ఒకటి లేదా రెండవ వారంలో పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా వైవిధ్యంగా వసంతోత్సవం చేద్దామని పాఠశాల బే ఏరియా యాజమాన్యం ఆలోచించింది. ఈ కొత్త ఆలోచన ప్రకారం శనివారం, 9 మే 2020న ఫ్రీమాంట్, శాన్రామన్ కేంద్రాలు, శనివారం 16 మే 2020న సన్నివేల్, డబ్లిన్, మిల్పిటాస్, శాన్హోసే కేంద్రాల పిల్లలు తమ సాంస్క•తిక ప్రదర్శనలు చేస్తారని ఈ ప్రదర్శనలన్నీ యూట్యూబ్ ద్వారా అందరూ చూడాలని పాఠశాల అడ్వయిజర్ వీరు ఉప్పల తెలిపారు.
కార్యక్రమాన్ని రూపొందించటానికి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పాఠశాల సీఈఓ చెన్నూరి వెంకట సుబ్బారావు, అడ్వయిజర్ శ్రీమతి విజయ ఆసూరి, డైరెక్టర్ ప్రసాద్ మంగిన, తానా తరపున వెంకట్ కోగంటి, రజనీకాంత్ కాకర్లతోపాటు పాఠశాల టీచర్లు పాల్గొన్నారు. వర్చువల్ వసంతోత్సవ కార్యక్రమాన్ని రూపొందిస్తూ డైరెక్టర్ శ్రీ ప్రసాద్ మంగిన మాట్లాడుతూ పాఠశాల పిల్లలు తమ ఇళ్ళలోనే తయారై ఒకళ్ళ తరువాత ఒకళ్లు తమ ప్రదర్శనలు ఇస్తారని, వాటిని అంతా కోడ్రీకరించి, అనుసంధానం చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ప్రసారం అవుతుందని తెలిపారు. టీచర్లు, తల్లిదండ్రులు కో ఆర్డినేషన్ చేసుకుని పిల్లల చేత ప్రదర్శనలు చేయిస్తారని, ఇది ఒక కొత్త ప్రయోగం అని, దీనిని అందరూ జయప్రదం చేయాలని ప్రసాద్ మంగిన కోరారు. మరిన్ని వివరాలను వేడుక ముందు రోజులలో ప్రకటిస్తామని చెప్పారు.