శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాస్త్రోక్తంగా నిర్వహించింది. అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయశుద్ధిలో పాల్గొన్నారు.
ఆనందనిలయం, వెండి, బంగారువాకిళ్లు, ఉపాలయాలు, ప్రసాదం పోటు, ధ్వజస్తంభం, ప్రాకారం, గోపురాలు, పూజాసామగ్రిని శుద్ధిచేశారు. సుగంధద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. స్వామివారి మూలవిరాట్టుకు ఏకాంతంగా పూజలు పూర్తిచేశాక మధ్యాహ్నం నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం మంగళవారం ఆలయశుద్ధి చేసినట్లు వివరించారు. ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులు చలితో ఇబ్బంది పడకుండా గతేడాది తరహాలోనే నారాయణగిరి ఉద్యానవనాలతోపాటు మాడవీధుల్లో షెడ్లు నిర్మించామని, భక్తులకు సమయానుకూలంగా అన్న ప్రసాదాలు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు.